
కళారంగానికి చేయూతనిస్తాం
భీమవరం: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పుంజుకున్న తరువాత కళారంగానికి చేయూతనిస్తామని సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి సంగీత, నృత్య నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాటకాలపై ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేయడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. కళా పరిషత్ల ద్వారా నాటకరంగం నిరంతరం కొనసాగడానికి పరిషత్ నిర్వహణ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి సమావేశం నిర్వహణకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు బాలాజీ నాయక్కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారంతో సత్కరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెన్మెత్స కృష్ణంరాజును ఆత్మీయ చైతన్య పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి అంజిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.