ఉపాధిలో వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో వేతన వెతలు

Apr 25 2025 8:18 AM | Updated on Apr 25 2025 8:18 AM

ఉపాధి

ఉపాధిలో వేతన వెతలు

సాక్షిప్రతినిధి, ఏలూరు: ఉపాధి హామీ కూలీల బకాయిలు నెలనెలకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ. 66.39 కోట్లు బకాయిలున్నాయి. వాస్తవానికి ప్రతి 15 రోజులకోసారి చేసిన పనులకు చెల్లింపులు జరగాల్సి ఉన్నా జిల్లాలో మాత్రం మూడు నెలలుగా బకాయిలు చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులైతే జరుగుతూ ఉన్నా ఇప్పుడు చేసే పనుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఒక పక్క పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వంపై జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు దాదాపు మూడు నెలలు కావస్తున్నా తమకు వేతనాలు చెల్లించకపోవడంపై ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మండిపోతున్న నిత్యావసరాలు, కూరగాయలు, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు.. మరో పక్క సక్రమంగా అందని ఉపాధి వేతనాలు వెరసి తమ జీవనం మరింత దుర్భరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తమపై సానుకూలంగా స్పందించి బకాయి వేతనాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు

జిల్లాలోని 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రతి కూలీకి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకోసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు.

కనీస సౌకర్యాలు కల్పించాలి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో టెంట్‌, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని వాటిని ఎదు ర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు.

వేతన పెంపుతో సరి

ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.300 చెల్లించేవారు. తాజాగా కేంద్రం 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7 వేతనం పెంచుతూ రోజుకు కూలీలకు రూ.307 చెల్లించాలని జీఓ విడుదల చేసింది. పెరిగిన ధరలతో పోలిస్తే కేంద్రం పెంచిన రూ.7 ఏ మూలకు సరిపోతాయి అంటూ ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3 నెలలు.. రూ.66.39 కోట్లు

జిల్లావ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో జిల్లాలో కూలీలకు రూ.61.39 కోట్లు వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.49.83 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత ఏప్రిల్‌ నెలకు సంబంధించిన బకాయి వేతనాలు రూ.16.56 కోట్లు కలిపి మొత్తం రూ.66.39 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలే ఇంత పెద్ద మొత్తంలో పేరుకుపోతే ఉపాధి కూలీలు ఏం తిని బతుకుతారు అంటూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పని దినాలు పెంచాలి

ఉపాధి హామీలో పని దినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని చూపించాలి. ఒంటరి మహిళలకు జాబ్‌ కార్డులు ఇవ్వాలి.

– పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏలూరు

పేదల బతుకులు భారం

కూలి డబ్బుల బకాయిలు రూ.66.39 కోట్లు

3 నెలలుగా కూలీల ఎదురుచూపులు

100 రోజుల పని దినాలకు 46 రోజులే పూర్తి

గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి వేతనాలు

జిల్లాలో 5.57 లక్షల మంది కూలీలు

ఉపాధిలో వేతన వెతలు 1
1/1

ఉపాధిలో వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement