
ఫెయిల్ అయ్యామని కుంగిపోవద్దు
ఏలూరు(మెట్రో): ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యా ర్థులు ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షల్లో చిన్నపాటి పొరపాట్ల వల్ల మార్కులు తగ్గి ఫెయిల్ అయి ఉండొచ్చన్నారు. అంతేగానీ ఫెయిల్ అయిన విద్యార్థులు తెలివితేటలు లేనివారు మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో నిరాశ చెందకుండా సాధన చేసి ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన విద్యాబోధనను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎటువంటి ప్రతికూల ఆలోచనలతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా నిర్విరామంగా కృషి చేస్తే విజయం తథ్యమని అన్నారు. మే 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 22,365 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 17,274 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫెయిలైన 5,091 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలని, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఉత్తీర్ణతకు ఎంఈఓలు, హెచ్ఎంలు కార్యాచరణ తయా రు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఒకటి, రెండు సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి