టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌!

AP TET Qualifications, Exam Procedure, Syllabus , Preparation Guidance - Sakshi

ఏపీ టెట్‌–2021 

ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఉండే గౌరవం, ఆదరణ ఎనలేనిది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువంటే..ఎంతో క్రేజ్‌! లక్షల మంది సర్కారీ టీచర్‌గా బోధనా రంగంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, టీచింగ్‌ వృత్తిలోకి ప్రవేశించాలంటే.. తొలుత టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అర్హత సాధించడం తప్పనిసరి. కాగా, మేలో ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఏపీ టెట్‌ అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

సమాజ ప్రగతికి కీలకమైన విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ)...టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను ముందుకు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు‘టెట్‌’ను  నిర్వహిస్తున్నాయి.  గతంలో టెట్‌ అర్హతా గుర్తింపు ఏడేళ్లు కాగా, ప్రస్తుతం టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే సరిపోతుంది. ఏపీ టెట్‌కు సంబంధించి.. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు(ఎస్‌జీటీ) పేపర్‌–1ఏ; ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు(స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌–2ఏ రాయాల్సి ఉంటుంది. 

20 శాతం వెయిటేజీ
ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే.. డీఎస్సీ రాయాలి. దాని కంటే ముందు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అంతేకాకుండా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది.

అర్హతలు
టెట్‌ రాసేందుకు పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ /లాంగ్వేజ్‌ పండిట్‌ /బీఎల్‌ఈడీ/డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ /బీపీఈడీ తత్సమాన కోర్సులు చదివుండాలి. 

పరీక్ష విధానం
►ఏపీ టెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పోటీ పడేవారు పేపర్‌ 1ఏకు; 6–8 తరగతుల టీచర్‌ పోస్టులకు పోటీ పడేవారు పేపర్‌ 2ఏకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు పేర్కొన్న అర్హతలు కలిగిన వారు రెండు పేపర్లకూ హాజరవ్వొచ్చు. టెట్‌ ప్రశ్నపత్రం మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 
►పేపర్‌ 1బీ, పేపర్‌ 2బీలు స్పెషల్‌ స్కూల్స్‌లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌కు ఉద్దేశించినవి. డీఈడీ, బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ బేస్డ్‌ రిహాబిలిటేషన్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. రెగ్యులర్‌ స్కూల్స్‌లో పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు పేపర్‌ 1ఏ, పేపర్‌ 2ఏలకు హాజరవ్వాల్సి ఉంటుంది. 

తెలుగు(లాంగ్వేజ్‌ ఐ) కంటెంట్‌–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; ఇంగ్లిష్‌ కంటెంట్‌–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; గణితం కంటెంట్‌–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; పరిసరాల విజ్ఞానం కంటెంట్‌–24 మార్కులు, పెడగాజీ– 6 మార్కులకు ఉంటుంది.

టెట్‌  పేపర్‌ 2ఏ
పరీక్ష సమయం: రెండున్నర గంటలు; మార్కులు: 150.
ఏపీ టెట్‌ పేపర్‌ 2ఏలో మ్యాథమెటిక్స్, సైన్స్‌ ఒక విభాగం గానూ; సాంఘికశాస్త్రం మరో విభాగంగానూ ఉంటాయి. విద్యార్థులు వారి వారి సబ్జెక్టుల ఆధారంగా ఆయా విభాగాలకు హాజరవుతారు. సిలబస్‌ ప్రకారం–ప్రశ్నలు, మార్కులు పరి శీలిస్తే.. శిశు వికాసం శాస్త్రం(సైకాలజీ)–30మార్కులు; తెలుగు కంటెంట్‌–24 మార్కులు, మెథడాలజీ–6 మార్కులు; ఇంగ్లిష్‌ కంటెంట్‌–24 మార్కులు, మెథడాలజీ–6 మార్కులు; మ్యాథ మెటిక్స్‌ కంటెంట్‌ 24మార్కులు+మెథడాలజీ 6 మార్కులు; అలాగే సైన్స్‌ కంటెంట్‌ 24 మార్కులు+ మెథడాలజీ 6 మార్కులకు చొప్పున–మొత్తం 60 మార్కులకు గణితం, సైన్స్‌ విభాగం పరీక్ష జరుగుతుంది. అలాగే సోషల్‌ సైన్స్‌ మొత్తం 60మార్కులకు జరిగితే.. ఇందులో కంటెంట్‌–48మార్కులకు, మెథడాలజీ 12మార్కులకు ఉంటుంది. సైన్స్‌ కంటెంట్‌కు కేటాయించిన 24 మార్కుల్లో ఫిజికల్‌ సైన్స్‌కు 12 మార్కులు, బయలాజికల్‌ సైన్స్‌కు 12 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్‌ టీచర్లకు కంటెంట్‌పై 12 మార్కులు,పెడగాజీపై 12 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

టెట్‌ కనీస అర్హత మార్కులు
ఏపీ టెట్‌లో జనరల్‌ అభ్యర్థులు(ఓసీలు) కనీసం 60శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు పొందితేనే.. అర్హత సాధించినట్లుగా పేర్కొంటారు. 

స్కూల్‌ అసిస్టెంట్‌(6–8 తరగతులు)
►ఆయా సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి.
►బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
►సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలపై దృష్టిసారించాలి.

మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. 

మాక్‌టెస్ట్‌లు: కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు–స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్‌ ముఖ్యం. మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లోని లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది.

ప్రిపరేషన్‌ పక్కాగా
ఎస్‌జీటీ విద్యా దృక్పథాలు
దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం(ఎన్‌సీఎఫ్‌–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. 

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం
శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు  ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన–స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా.. సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

కంటెంట్‌
►తెలుగు(ఆప్షనల్‌), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌స్టడీస్‌ సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతోపాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, టైప్స్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్‌ తదితరాలపై పట్టు సాధించాలి. 
►గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్‌ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తి మార్కులు లభిస్తాయి.
►సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
►ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.
►సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.

మెథడాలజీ
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్‌ రూపకల్పనతో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్‌ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top