రెండున్నరేళ్లపాటు కనీవినీ ఎరుగని హింసతో అట్టుడికి, నిరుడు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనలో కొచ్చిన మణిపుర్లో ఎట్టకేలకు బుధవారం ముమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే మెయితీ తెగకు చెందినవారే అయినా ఖేమ్చంద్కు మధ్యేవాదిగా ముద్ర ఉంది. మణిపుర్ సమాజంలో తీవ్రస్థాయి విద్వేషాలు ప్రబలిన వర్తమానంలో ఆగ్రహావేశాలు అంత త్వరగా సమసిపోవు.
అందుకే కుకీ–జో తెగలకు చెందిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ‘మెయితీ ప్రభుత్వం’లో చేరొద్దంటూ ఆ తెగలకు చెందిన సంస్థలు హెచ్చరించాయి. దాన్ని బేఖాతరు చేసి, ఢిల్లీలోని మణిపుర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రమాణం చేసిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్పై నిప్పులు చెరిగారు. రాజధాని ఇంఫాల్లో ఆమె ప్రమాణం చేయలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. మెయితీల ఆధిక్యత గల ఇంఫాల్ మణిపుర్ లోయలో ఉంది. వారినుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతోపాటు, కుకీలు కూడా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. సమస్య ఎంత జటిలంగా మారిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ వ్యవహార శైలి మెరుగ్గావుంటే, ఇలాంటి సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. అయితే సమాజంలో సామరస్యతకు ముందు సొంతింటిని చక్కదిద్దుకోవటానికి బీజేపీ కృషి చేయాల్సి ఉంది. అధిష్ఠానం మాటవినే సంస్కృతికి భిన్నంగా అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇష్టారాజ్యం సాగించారు. పరిస్థితి క్షీణిస్తోందని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తున్నా ధోరణి మార్చుకోలేదు. రాజీనామా చేయమని ఆదేశిస్తే శిరసావహించి నట్టు కనబడి, పెద్ద డ్రామా సృష్టించి జనం అడ్డుకున్నారని ఆగిపోయారు. ఎట్టకేలకు నిరుడు ఫిబ్రవరి 9న ఆయనతో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.
అప్పటికే ఆయన తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించి కుకీల్లో అసంతృప్తి రెచ్చగొట్టారు. వారితో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకొని ఆగ్రహావేశాలను పెంచారు. వారిని గంజాయి పండించేవారిగా, మాదకద్రవ్య పంపిణీదార్లుగా, అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చేవారిగా చిత్రించారు. మణిపుర్లో హింస చెలరేగే నాటికే అక్కడ ఇరుపక్షాల్లోనూ ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడింది. 2023 మే నుంచి హత్యలు, లూటీలు, గృహదహనాలు, పార్థనా స్థలాలకు నిప్పెట్టడ యథేచ్ఛగా కొనసాగాయి. 260 మంది హత్యకు గురయ్యారని, 1,000 మంది గాయపడ్డారని, 32 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 60,000 మందికి పునరావాస శిబిరాలే శాశ్వత చిరునామాలయ్యాయి.
అంతా సవ్యంగా ఉన్నందువల్లే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని అనుకోనవసరం లేదు. రాష్ట్రపతి పాలన ఏడాదికి మించి పొడిగిస్తే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు తప్పలేదు. ఇప్పటికీ మెయితీలు, కుకీ–జోలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు పోయే పరిస్థితి లేదు. తమ ప్రాంతాలకు స్వయంపాలన హక్కు ఇచ్చేందుకు అంగీకరించి, అందుకు నిర్దిష్ట కాల పరిమితిని లిఖిత పూర్వకంగా ప్రకటిస్తేనే ప్రస్తుతానికి ప్రభుత్వంలో పాలుపంచు కునేందుకు సిద్ధపడతామని కుకీ–జో తెగలు ఇప్పటికే తెలిపాయి. ఆ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదన్న ఆగ్రహంతోనే కొత్త సర్కారులో ఎవరూ భాగస్వామ్యం తీసుకోవద్దని వారు పిలుపునిచ్చారు.
ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం విడిచిపెట్టదల్చుకున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం సంగతలా ఉంచి ముందు సంయమనం పాటించటం, అందరినీ కలుపుకొని వెళ్లటం వంటివి అవసరమని ఖేమ్చంద్ తెలుసుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వం వస్తే కనీసం సమస్యలు చెప్పుకునే వీలుంటుందని జనం అనుకుంటారు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ పరిష్కారాలపై పెద్ద ఆశలేమీ ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న విశ్వాసమైతే కలగాలి. ఆ విశ్వాసాన్ని ఖేమ్చంద్ ప్రభుత్వం పొంద గలిగితే కొంతమేర విజయం సాధించినట్టే!


