ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఆమె... స్థిరంగా ముందుకు సాగుతున్న ఆర్థిక వృద్ధిని అదే స్థాయిలో ముందుకు నడిపించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ, తయారీరంగ పరిశ్రమల పెంపునకూ తోడ్పడే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కూడా ఏవో అద్భుతాలుంటాయని ఎప్పటిలాగే మధ్యతరగతి, వ్యాపార వర్గాలు ఆశించిన మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల విడిచి సాము మంచిది కాదన్న ధోరణినే కనబరిచారు. అవసరమైనచోట్ల వెసులుబాట్లకు కూడా చోటిచ్చారు. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయటం అందులో ఒకటి. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువుల కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గించటం కూడా మంచి నిర్ణయం.
మూలధన వ్యయం ఈసారి రూ. 12.22 లక్షల కోట్ల వరకూ ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. నిరుటి ప్రతిపాదన రూ. 10.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో దీన్ని వ్యయం చేయటానికి సంకల్పించారు. పర్యవసానంగా హైవేలూ, సరుకు రవాణా కారిడార్లూ, ఓడరేవులు, జాతీయ జల రవాణా మార్గాలు, పట్టణప్రాంత ప్రజా రవాణా తదితర రంగాలు బహుముఖంగా విస్తరిస్తాయి. ఇదంతా దక్షిణాది రాష్ట్రాల్లో పరిశ్రమల విస్తరణకూ, ఉద్యోగాల కల్పనకూ ఎంతగానో దోహద పడుతుంది. పెంచిన ఈ మూలధన వ్యయాన్ని రాష్ట్రాలు వడ్డీరహిత రుణాలు పొంది, పెట్టుబడులు పెట్టడానికి వినియోగిస్తామని చెప్పారు.
దానికే పరిమితమైతే లక్ష్యసాధనకు ఎంతమాత్రం సరిపోదు. తయారీ రంగంలో ఫార్మా, సెమీ కండక్టర్లు, రసాయనాలు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, భారీ యంత్రాలు, క్రీడా పరికరాలు, రసాయనాలు తదితరాల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చేసిన ప్రతిపాదనలు సైతం మెచ్చదగ్గవే. అయితే ప్రస్తుతం అన్ని రంగాలనూ ఏలుతున్న ఏఐ ఆధారిత సాంకేతికత ఇక్కడ కూడా గణనీయంగా ఉంది. అందువల్ల ఈ రంగాలు తీసుకు రాబోయే ఉద్యోగకల్పనపై మరీ ఆశ పెట్టుకోనవసరం లేదు. విచక్షణారహితంగా సుంకాలు విధించే అమెరికా ధోరణి వల్ల ప్రైవేటు మదుపుదారులు ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశాలు తక్కువ.
ఈ బడ్జెట్లో మెచ్చదగ్గ ప్రతిపాదన కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడే సాంకేతికతలకై వచ్చే అయిదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యయం చేస్తామని చెప్పటం! స్వచ్ఛ ఇంధనానికి తోడ్పడే ఈ ప్రతిపాదనకు మరింత కేటాయిస్తే బాగుండేది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ తొలగింపునకూ, దాన్ని నిల్వ చేసి ఉత్పత్తులకు తోడ్పడటానికీ అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వటంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
మన వృద్ధి రేటు దాదాపు 7 శాతం ఉంది. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉంది. విదేశీ మారక నిల్వలకు కూడా లోటు లేదు. కానీ దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పడుతూ లేస్తూ సాగుతున్న క్రమంలో, అంతర్జాతీయంగా అంత సానుకూల వాతా వరణం కనబడని స్థితిలో జాగ్రత్తగా అడుగులేయటం మంచిదే. ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం మించనీయరాదన్న గత బడ్జెట్ లక్ష్యాన్ని సాధించటంలో విజయం సాధించి నట్టేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గించి 4.3 శాతానికి పరిమితం చేస్తామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు.
కానీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని పఠించటం అంత సులభం కాదు. తయారీరంగ పరిశ్రమల విస్తరణ ఉపాధి కల్పనకు తోడ్పడి,ప్రజల్లో కొనుగోలుశక్తిని పెంచుతుంది. ఆ దిశగా ప్రయత్నించటానికి ఈ బడ్జెట్ ప్రతిపాద నలు దోహదపడతాయనే చెప్పాలి. ఎంతో ఆచితూచి, జాగ్రత్తగా అడుగులేసిన ఈ బడ్జెట్ చూడటానికి నిరాశ కలిగించవచ్చుగానీ... ఈ అనిశ్చితిలో దూకుడుగా పోకుండా భయ భక్తులతో మెలగటమే క్షేమదాయకం.


