ఎస్‌టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు | Union Budget 2026–27 raised STT sharply what investors will do | Sakshi
Sakshi News home page

ఎస్‌టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు

Feb 2 2026 1:24 PM | Updated on Feb 2 2026 1:31 PM

Union Budget 2026–27 raised STT sharply what investors will do

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం వెలువడింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్‌ అండ్‌ ఓ) మార్కెట్‌లో విపరీతంగా పెరుగుతున్న స్పెక్యులేషన్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎస్‌టీటీ అంటే ఏమిటి? ఎందుకు పెంచారు?

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లను లేదా డెరివేటివ్స్‌ను కొనుగోలు చేసినా, విక్రయించినా ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఎస్‌టీటీ అంటారు. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్‌ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తూ భారీగా నష్టపోతున్నట్లు సెబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రిస్క్‌ను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ విభాగంలోని ఫ్యూచర్స్ లావాదేవీలపై పన్ను రేటును సవరించారు. గతంలో 0.02 శాతంగా ఉన్న ఈ పన్నును ఇప్పుడు 0.05 శాతానికి పెంచారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా, ట్రేడింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్స్ విభాగంలో కూడా పన్ను భారం పెరగనుంది. గతంలో ఆప్షన్స్ విక్రయాలపై 0.1 శాతంగా ఉన్న ఎస్‌టీటీ రేటును ప్రభుత్వం 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్ల లావాదేవీల ఖర్చు గణనీయంగా పెరగనుంది.

ఉదాహరణకు..

ఒక రిటైల్ ట్రేడర్ రూ.10 లక్షల విలువైన నిఫ్టీ ఆప్షన్స్‌ను విక్రయించాడనుకుందాం. 0.1 శాతం చొప్పున పాత పన్ను విధానంలో అతను రూ.1,000 ఎస్‌టీటీ చెల్లించేవాడు. 0.15 శాతంతో కొత్త పన్ను విధానంలో ఇప్పుడు అదే లావాదేవీపై రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కేవలం ఒక లావాదేవీపైనే 50% అదనపు పన్ను భారం పడుతోంది. ఇది చిన్న మొత్తాలతో ట్రేడింగ్ చేసేవారి లాభాలను గణనీయంగా తగ్గిస్తుంది.

ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మారుతున్న పన్ను నిబంధనల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • అతిగా ట్రేడింగ్ చేయకూడదు.. పన్నులు పెరిగినప్పుడు ప్రతి ట్రేడ్‌కు అయ్యే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి లాభం తక్కువగా ఉండి పన్నులు ఎక్కువగా ఉండే చిన్న ట్రేడ్లను నివారించండి.

  • డెరివేటివ్స్ నుంచి డెలివరీ వైపు.. కేవలం లాభం కోసం చేసే ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్ కంటే మంచి కంపెనీల షేర్లను కొని దీర్ఘకాలం ఉంచుకునే (Delivery Trading) పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పన్ను భారం తగ్గుతుంది.

  • ట్రేడ్ చేసేటప్పుడు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా పెరిగిన ఎస్‌టీటీ, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నులన్నీ పోగా లాభం మిగులుతుందో లేదో ముందే అంచనా వేసుకోవాలి.

  • మ్యూచువల్ ఫండ్స్/ ఈటీఎఫ్‌.. నేరుగా ట్రేడింగ్ చేసి నష్టపోయే కంటే నిపుణుల ద్వారా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితం.

ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement