విదేశాల నుంచి వచ్చే వారు సాధారణంగా మిత్రులు, బంధువులకు బహుమతులు తీసుకువస్తుంటారు. అయితే ఇప్పటివరకు దిగుమతి సుంకాలు, పరిమితుల కారణంగా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకురావడం సాధ్యపడేది కాదు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది.
అంతర్జాతీయ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఫ్రీగా భారత్కు తీసుకురాగల వస్తువుల విలువ పరిమితిని పెంచింది. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త బ్యాగేజీ నిబంధనలు ఏమిటంటే..
వాయు లేదా సముద్ర మార్గంలో వచ్చే భారత సంతతికి చెందిన నివాసితులు, పర్యాటకులు రూ. 75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 50,000 మాత్రమే ఉండేది.
అలాగే విమాన లేదా సముద్ర మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.
అయితే కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవు. 50 యూనిట్లకు మించిన తుపాకీ గుళికలు, 100 కంటే ఎక్కువ సిగరెట్లు, 25 కంటే ఎక్కువ సిగార్లు, 125 గ్రాములకంటే ఎక్కువ పొగాకు, 2 లీటర్లకు మించిన మద్యం, ఆభరణాల రూపంలో కాకుండా బంగారం లేదా వెండి, టెలివిజన్లు వీటిలో ఉన్నాయి.
కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు
కేంద్ర బడ్జెట్ 2026–27లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ నిర్ణయంతో భారత్లోకి దిగుమతి చేసుకునే వ్యక్తిగత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరింత అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ముందుగానే విడుదలైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.


