ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా? | Sakshi Editorial On Delhi Govt Negligence | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

Jun 4 2026 12:12 AM | Updated on Jun 4 2026 12:12 AM

Sakshi Editorial On Delhi Govt Negligence

అన్నిచోట్లా అడుగడుగునా కనబడే అవినీతి, నిర్లక్ష్యం దేశాన్నేలే ఉన్నతాధికార వ్యవస్థలు కొలువుదీరిన ఢిల్లీలో కూడా నిక్షేపంగా కొనసాగుతున్నాయని మూడురోజుల వ్యవధిలో జరిగిన రెండు విషాద ఘటనలు రుజువు చేశాయి. శనివారం రాత్రి అయిదంతస్తుల భవంతి కూలి పోటీ పరీక్షలకు కోచింగ్‌ కోసం వచ్చిన అయిదుగురు విద్యార్థులతోపాటు మరో మహిళ మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. ఇది మరువకముందే బుధవారం వేకువజామున దక్షిణ ఢిల్లీలో ఒక హోటల్‌ మంటల్లో చిక్కుకుని 21 మంది చనిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందటానికి వచ్చే విదేశీయులు ఈ హోటల్‌లో బస చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు ఉదంతాలూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) పనితీరుకు అద్దం పడతాయి. దేశంలో దాదాపు అన్నిచోట్లా నియమోల్లంఘనలు కనబడుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోని అధికార యంత్రాంగాలకూ కొదవ లేదు. కానీ ఢిల్లీలోనూ ఇదే స్థితి! పైగా ఇలాంటి ఉదంతాలు ఆ నగరానికి కొత్తగాదు. 2024లో ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మంటల్లో చిక్కుకుని ఏడుగురు నవజాత శిశువులు కన్నుమూశారు. అదే ఏడాది ఒక సెల్లార్‌లో నిర్వహిస్తున్న కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ మహానగరంలో కాలం చెల్లిన భవంతులు కూలడం, ఏడాదికి ఒకటో రెండో అగ్నిప్రమాదాలు రివాజుగా మారడం... అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించకపోవటం దిగ్భ్రాంతికరం.

ఎంసీడీ అధికారులు గుణపాఠం నేర్వకపోవడం సరే... ఢిల్లీ ప్రభుత్వం లేదా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిస్సహాయంగా మిగలటం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రి రేఖా శర్మకు ఈ సమస్యలన్నీ తెలియవనుకోలేం. ఆమె మూడు దఫాలు కార్పొరేటర్‌గా పని చేశారు. 2023లో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జవాబిస్తూ రాజధాని నగరంలో నియమాలు ఉల్లంఘించిన భవంతులు 55,000 వరకూ ఉన్నాయని తెలియజేసింది. ఆ జాబితాలోని ఎందరిపై చర్య తీసుకున్నారో, ఆ భవంతుల్ని ఏం చేశారో ఎవరికీ తెలియదు. శనివారం ప్రమాదం జరిగిన అయిదంతస్తుల భవనం కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిందే. కేవలం మూడంతస్తులకు అనుమతి ఉంటే, మరో రెండంతస్తులు వేయటమే కాక, తాజాగా మరో అంతస్తు నిర్మాణానికి పనులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

అప్పటికే బలహీనమైన పునాదులపై నాసిరకంగా నిర్మించిన ఆ భవంతిపై అదనపు భారం పడటంతో కూలిపోయిందని చెబుతున్నారు. అలాంటి భవంతి నివాసయోగ్యమైనదేనని ఎంసీడీలో ధ్రువీకరించిందెవరో తేలాలి. బంగారు భవిష్యత్తును ఆశించి రకరకాల కోచింగ్‌ల కోసమని యువత వస్తుంది. చవగ్గా లభిస్తుందన్న కారణంతో అనేకులు ఇలాంటి భవంతుల్ని ఆశ్రయిస్తారు. కిక్కిరిసిన జనావాసాలున్నచోట మంచినీరు, డ్రెయినేజి ఏర్పాట్లు, విద్యుత్‌ సరఫరా ఎంతో కష్టమవుతాయి. అయినా అధికార యంత్రాంగాలు మౌనంగా ఉండిపోతున్నాయి. బుధవారం మంటల్లో చిక్కుకున్న హోటల్‌ల్లో రాకపోకలకు కేవలం ఒకే మార్గం ఉందని చెబుతున్నారు. ఆరు గదులకే అనుమతి ఉన్న హోటల్‌ ఏకంగా అయిదంతస్తుల్లో ఇరవై గదులు నిర్మించింది. దీనికి అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ లేదంటున్నారు. 

మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే ప్రభుత్వ విధానాలు లేకపోగా, అక్రమ కట్టడాలు, కాలనీలు వెలుస్తాయి. అవి క్రమబద్ధమవుతాయి. అల్పాదాయ వర్గాలు ఏ సదుపాయాలూ లేని అలాంటి నాసిరకం భవంతుల్లో ఉండక తప్పడంలేదు. ఢిల్లీలో ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం దాదాపు 60 శాతంమేర ఉంటుందని ఒక అంచనా. 2014లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1,799 కాలనీలను క్రమబద్ధం చేశారు. అటుతర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కాలనీలను, నిర్మాణాలనూ అనుమతించ బోమన్నారు. కానీ ఈ పుష్కరకాలంలో అలాంటి మరిన్ని వందల కాలనీలు, వాణిజ్య, నివాస భవంతులు ఉనికిలోకొచ్చాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఎంసీడీ తనిఖీలు సాగుతుంటాయి. అవన్నీ మొక్కుబడి వ్యవహారాలేనని ఈ ప్రమాదాలు రుజువు చేస్తు న్నాయి. భూకంప జోన్‌–4లో ఉన్న ఢిల్లీలో ఇకనైనా పాలకులు మేల్కొంటారా? నిర్మాణ రంగ ఇంజినీర్లతో, నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారా? 

Advertisement
 
Advertisement
Advertisement