సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అర్జీలు చేతబట్టి.. ఊరికాని ఊరువచ్చి.. తమ సమస్యలు పరిష్కరించడంటూ జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనేక మంది వస్తున్నాయి. ఇక్కడ క్యూ కడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి అర్జీదారులు అధికంగా వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా స్థాయి అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. అయితే వీటికి సకాలంలో పరిష్కారం లభించకపోవడంతో తిరిగి అర్జీలు ఇచ్చేందుకు వస్తుండడంతో, ప్రతి వారం అర్జీల సమస్య పెరుగుతూ వస్తోంది. కొంతమంది విసుగు చెంది వదిలేస్తుండగా, మరి కొంతమంది ఆశగా తిరుగుతూనే ఉన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించగా, మొత్తం 179 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి చెందిన అర్జీలే అధికంగా ఉన్నాయి. వీటిని పరిశీలించిన జిల్లాస్థాయి అధికారులు ఆయా అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశారు.
పింఛన్ ఇవ్వడం లేదు
నాకు గతంలో పింఛన్ ఇచ్చేవారు. కానీ మా అబ్బాయికి వికలాంగుడి కోటాలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి నాకు పింఛన్ ఆపేశారు. మా అబ్బాయి నా దగ్గర ఉండటం లేదు. పని చేసుకునే ఓపిక నాకు లేదు. ఎవరైనా పెడితే తింటున్నాను. నాకు తిరిగి పింఛన్ ఇప్పించాలి.
– ఎడ్లపల్లి పెద్ద వీరాస్వామి,
తాడిపర్రు, ఉండ్రాజవరం మండలం
ఫ పీజీఆర్ఎస్కు వెల్లువలా అర్జీలు
ఫ ఒక్కరోజే 179 వినతుల స్వీకరణ
మోటార్ల చోరీలు ఆగడం లేదు
మా పొలంలో మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు జరిగింది. మా పక్క పొలంలోనూ చోరీలు జరుగుతున్నాయి. ఒక్క మోటారు విలువ రూ.40 వేలపైనే ఉంటుంది. పంటలు పండక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాకు ఇది ఇబ్బందిగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఎస్.వెంకటేశ్వరరావు, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం
ఎస్సీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయండి
రాజమహేంద్రవరంలో ఎస్సీల కోసం స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని అనేక సార్లు అధికారులకు, కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాను. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం కూడా చూపించాం. అయినా ఎస్సీ స్టడీ సెంటర్ని నెలకొల్పడం లేదు. వెనుకబడిన వర్గాల కోసం దీనిని ఏర్పాటు చేయాలి.
– జార్జి అంథోని, డివిజనల్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు


