ప్రభుత్వానికి ఏటీఎంలా పోలవరం ప్రాజెక్టు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఏటీఎంలా పోలవరం ప్రాజెక్టు

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును డబ్బులు సంపాదించే ఏటీఎం మెషీన్‌లా వాడుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నిర్మించేలా ఒప్పందం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుని, ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదట రూ.6 వేల కోట్లుగా ప్రకటించగా, ప్రస్తుతం రూ.66 వేల కోట్లు దాటిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండటంతో రెండు ప్రభుత్వాల అనుమతులు అవసరం ఉందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కొన్ని కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయని, పోలవరం భూములు 5వ షెడ్యూల్‌, ఏపీ ఎల్‌పీఆర్‌ చట్ట పరిధిలో ఉన్నాయని చెప్పారు. షెడ్యూల్‌ ప్రాంతాల భూములను ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. పోలవరం హైడ్రో పవర్‌ను ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్‌కోకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములను గ్రీన్‌కో, మెగా సంస్థలకు పవర్‌ ఉత్పత్తి కోసం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు జాతీయ గిరిజన కమిషన్‌, సంబంధిత గిరిజన సంక్షేమ సంస్థలు రంగంలోకి దిగాయన్నారు. ఈ భూముల కేటాయింపు విషయంలో చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించిన భూములను ప్రభుత్వమే వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

మాజీ ఎంపీ హర్షకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement