ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేసుకోవచ్చనే ఆశతో చాలామంది అప్పులు చేసి మరీ డబ్బులు కట్టారు. ఇందులో పేదలే ఎక్కువ మంది ఉన్నారు. సదరు సంస్థ సిబ్బందిని తక్షణం అరెస్టు చేసి, వారి నుంచి డబ్బు రికవరీ చేసి బాధితులకు అందజేయాలి. జిల్లా డీలర్ ఇంటి పవన్ కుమార్ని వెంటనే అరెస్టు చేయాలి.
–తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
ఇల్లు కుదువపెట్టి..
ఇంటి వద్ద ఉండి సంపాదించుకోవచ్చని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నాను. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బులు లేకపోతే, ఇంటి కాగితాలు కుదువపెట్టి రూ.1.40 లక్షలు కట్టాను. కానీ మమ్మల్ని ఆ సంస్థ మోసం చేసి బోర్డు తిప్పేసింది. ఇప్పుడు ఇంటి కాగితాలు ఎలా విడిపించుకోవాలో తెలియడం లేదు. మాకు దిక్కెవరు.
– ఎన్.సత్యవతి, జగన్నాథపురం
మొదటి నెల రూ.24 వేలు వేశారని..
నేను రూ.1.30 లక్షలు కట్టాను. నాకు మెటీరియల్, మెషీన్ పంపారు. అంతేకాకుండా మొదటి నెల రూ.24 వేలు వేశారు. దీనితో నమ్మకం కుదరడంతో మరో రూ.యాభై వేలు పంపాను. నన్ను చూసి చాలామంది డబ్బులు కట్టారు. కానీ తరువాత నెల నుంచి నాకు డబ్బు పడలేదు. పైగా అందరిని మోసం చేసి బోర్డు తిప్పేశారు. నాకు పంపిన మెటీరియల్, మెషీన్ కూడా విలువైంది కాదని తెలిసింది.
– బి.సుబ్బలక్ష్మి, బండారులంక
గృహిణులే టార్గెట్గా
జిల్లాలో నిరుద్యోగులు, ముఖ్యంగా గృహిణులే టార్గెట్గా ఈ మోసానికి తెగబడ్డారు. కొంతమంది యూపీఐ యాప్ ద్వారా ఫోన్ పే చేస్తే, కొంతమంది డీలర్ చేతికి డబ్బులు ఇచ్చారు. వీరంతా అప్పులు చేసుకుని, ఇల్లు తనకా పెట్టి, బంగారం తాకట్టు పెట్టి కుటుంబం బాగుంటుందని ఈ గ్రీన్ స్క్రబ్బర్ల కంపెనీలో చేరారు. అమాయకులను మోసం చేసిన వారిని వదిలిపెట్టకూడదు.
– ఆనంద్కుమార్, సీపీఐ కోనసీమ జిల్లా సమితి సభ్యుడు


