● హైవే పెట్రోలింగ్ వాహనం వచ్చేలోగా
అంతా సర్దేసిన ఆగంతకులు
● కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం
ఆలమూరు: మండలంలోని మడికి 216ఏ జాతీయ రహదారి మడికి వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ ఆదివారం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం రావులపాలెం వైపు నుంచి సుమారు రెండు టన్నుల బియ్యంతో వెళ్తున్న వ్యాన్ పొట్టిలంక సమీపంలో డివైడర్ దాటుతుండగా అదుపు తప్పి హైవే మధ్యలో తిరగబడింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ తప్పించుకుని వెళ్లిపోగా, వెంటనే కొందరు మరో వ్యాన్లో వచ్చి కూలీలతో పది నిమిషాల్లో బియ్యాన్ని తిరిగి లోడ్ చేసేసి వెళ్లిపోయారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారంతా బోల్తా పడ్డ వాహనాన్ని అక్కడే వదిలేసి బియ్యంతో పరారవ్వడం స్థానికంగా అనుమానాలకు తావిస్తోంది. రేషన్ బియ్యం కావడం వల్లే అధికారులకు చిక్కకుండా ఇలా తరలించారని స్థానికులు అనుకుంటున్నారు. కాగా బోల్తా పడిన వాహనం ఆధారంగా అందులో ఉన్నది రేషన్ బియ్యమా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. రహదారి మధ్యలో వాహనం బోల్తా పడడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


