రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికో ప్రియాంక ప్రమాద సంఘటనపై చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత స్పందించకపోవడంపై ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియా ముందు కనీసం పరామర్శించలేదని తన ఆవేదనను వ్యక్తపరిచారన్నారు. ప్రియాంక ప్రమాద సంఘటనకు సంబంధించిన వీడియోను జగనన్న కనెక్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డిలీట్ చేసిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుండడంతో యువత పాడై పోతుందన్నారు. మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రియాంక కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


