● డీఎస్సీ నియామకాల్లో
దగాపై చంద్రబాబుకు దడ
● అందుకే సీబీఐ విచారణకు వెనకంజ
● బాధ్యత వహిస్తూ లోకేష్
రాజీనామా చేయాలి
● రిలే దీక్షల్లో వైఎస్సార్ సీపీ
శ్రేణులు, యువత
సాక్షి, రాజమహేంద్రవరం: దగా డీఎస్సీతో అడ్డంగా దొరికిపోయారు.. అయినా బుకాయింపు ఎందుకు బాబూ అంటూ అంతా మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన డీఎస్సీ అక్రమాలపై తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని రిలే దీక్షల్లో యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు పట్టుబడుతున్నారు. అవకతవకలు జరగడం వల్లే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమూరులో రాజమహేంద్రవరం రూరల్ ఇన్చార్జి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మోరంపూడి జంక్షన్లో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రిలే దీక్షలను ప్రారంభించారు.
నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మండపేట, గోపాలపురంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదు. దీంతో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి.
– మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ,
వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రజలు విసుగుచెందారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులను అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకు నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం.
– జి.శ్రీనివాస్నాయుడు, మాజీ ఎమ్మెల్యే


