వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం సిటీ: వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో ప్రియాంకను కారుతో ఢీకొన్న ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటువంటి ఘటనల ద్వారా చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్, సారా విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. కేవలం మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ, కూటమి నాయకులు జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గడిచిన రెండేళ్లలో జిల్లాలో 147 కేసుల్లో 6,200 కిలోల గంజాయి పట్టుబడిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశానికే దిశానిర్దేశం చేసిన ’దిశ’ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో మహిళలు, యువతలో చిన్నారులకు చీకటిరోజుగా రాజా అభివర్ణించారు.


