బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదో తేదీన దేశ వ్యాప్తంగా జైల్ భరో నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను తరిమికొట్టడంలో స్ఫూర్తిగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, వ్యవసాయం కార్పొరేటీకరణ తదితర అంశాలపై ఐక్య పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కలిపి చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు బంగారు రాజేష్, సింగంపల్లి రమణ, నరుకుర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
స్కాలర్షిప్ దరఖాస్తులకు 31 వరకు గడువు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 10, 11, 12 తరగతుల విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. 2022, 23, 24 సంవత్సరాల్లో మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు ప్రభుత్వ స్కాలర్షిప్ పోర్టల్ స్కాలర్షిప్స్.జీవోవీ.ఐఎన్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చే సుకోవాలన్నారు. దరఖాస్తు సమయంలో బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసి, సీడ్ చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర సమాచారానికి సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ కార్యా లయాన్ని సంప్రదించాలని డీఈఓ సూచించారు.
ఏలేరులో స్నానానికి దిగి యువకుడి గల్లంతు
జగ్గంపేట: మండలం భావవరం వద్ద అటవీ ప్రాంతంలో వున్న ఏలేరు రిజర్వాయర్ ప్రాంతంలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గండేపల్లి మండలం సూరంపాలేనికి చెందిన ఆదిత్య కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఏలేరు నదిలో స్నానానికి దిగారు. వారిలో తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన వడ్డి ప్రశాంత్ కుమార్ (18) లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో మునిగిపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా పోలీసులు అతడిని వెదికే ప్రయత్నం చేసినా చీకటి పడడంతో గాలింపు చర్యలు ముందుకు సాగలేదు.
నాగంపల్లిలో చోరీ కేసు నమోదు
సీతానగరం: మండలంలోని నాగంపల్లిలో ఉద్దగిరి అనంతలక్ష్మి ఇంట్లో చోరీ జరిగిందని, కేసు నమోదు చేశామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ బుధవారం తెలిపారు. కొంతకాలంగా ఆమె కాకినాడలో నివసిస్తోందని, పెన్షన్ కోసం నాగంపల్లి వచ్చి తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండడాన్ని చూసి లోపల గమనించగా ధాన్యం బస్తాలు, రాగి, ఇత్తడి సామాన్లు, తులం బంగారు ఉంగరం, అరకాసు దుద్దులు, రూ.లక్ష చోరీకి గురైనట్టు గుర్తించారు. మంగళవారం ఇచ్చిన ఫిర్యాదుతో ఆధారాలు సేకరించారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


