చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెం శివారులోని చెరువు వద్ద కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ గని (44) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కె.నరేంద్ర మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ గని సోమవారం రాత్రి చాగల్లు నుంచి ప్యాసింజర్ ఆటో వేసుకుని నిడదవోలు వైపు వస్తుండగా బ్రాహ్మణగూడెం వద్ద నిడదవోలు నుంచి చాగల్లు వైపు వెళ్తున్న ఎర్టీగా కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడి గని తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతిచెందాడన్నారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఇక మాకు ఎవరున్నారు.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారని అతడి భార్య సభాన రోదించిన తీరు కంటతడి పెట్టించింది. గనికి ఇద్దరు అమ్మాయిలు ఉండగా పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది. మృతుడి భార్య సభాన ఇచ్చిన ఫిర్యాదుపై కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
బ్రాహ్మణగూడెం శివారులో ఘటన


