2023లో దేవస్థానం ఈఓగా పనిచేసిన ప్రస్తుత అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో ఆయన సత్యగిరి నుంచి గిరిప్రదక్షిణ రోడ్డులోకి మరో ఘాట్రోడ్ ప్రతిపాదించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరం, విజయవాడ వైపు వాహనాలను ఆ రోడ్డు మీదుగా గిరిప్రదక్షణ రోడ్డుకు అక్కడ నుంచి జాతీయ రహదారికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఆయన అన్నవరం నుంచి బదిలీ అవ్వగానే అది అమలుకు నోచుకోలేదు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే నిత్యం భక్తుల వాహనాలు అటువైపు కూడా ప్రయాణించేవి. అందువలన ఆక్రమణలకు అవకాశం ఉండేది కాదు.సత్యగిరి కొండ పూర్తి స్థాయిలో సర్వే చేసి ఫెన్సింగ్ వేయిస్తాం
గిరిప్రదక్షణ రోడ్డులో సత్యగిరి కొండను ఆనుకుని పోడు వ్యవసాయం చేసిన భూమి దేవస్థానానిదేనని సర్వేలో తేలింది. దీంతో అక్కడ పరికరాలు స్వాధీనం చేసుకున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు జరుగకుండా మొత్తం సత్యగిరి కొండపై దేవస్థానం భూమి అంతా సర్వే చేయాలని ఆదేశించాం. మంగళ, బుధవారాల్లోనే సర్వే ప్రారంభమవుతుంది. సర్వే అయిన తరువాత పది అడుగులకొక స్తంభం పాతి ఫెన్సింగ్ చేయిస్తాం. దేవస్థానానికి చెందిన అంగుళం భూమి కూడా వదిలే ప్రసక్తే లేదు.
– నల్లం సూర్య చక్రధరరావు, ఈవో , అన్నవరం


