ఫ సమస్యల పరిష్కారానికి అవకాశం
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమస్యలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని మొదటి మార్గంగా ఎంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహించే మధ్యవర్తిత్వం, దేశం కోసం అవగాహన అనే ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలోని బహుళ న్యాయస్థాన సముదాయంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టుల్లో పేరుకుపోతున్న వేల కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగకరమన్నారు. కోర్టు విచారణ సమయం ఖర్చుతో కూడుకున్నదని, మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ వ్యయంతో వేగంగా పరిష్కారం పొందవచ్చన్నారు. మధ్యవర్తిత్వంలో ఇరు పక్షాలు పరస్పరం చర్చించుకుని తమ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించామన్నారు. అనంతరం మధ్యవర్తిత్వం ప్రయోజనాల పోస్టర్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్వీ ప్రసాద్, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


