ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గురువారం రాత్రి కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమంగా పెరిగింది. దీంతో మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీలోని మొత్తం 175గేట్లకు 159 గేట్లను లేపారు. బ్యారేజీ నుంచి 2,02,036 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 28.30 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో శుక్రవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు నీటి ఉధృతి చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ధవళేశ్వరం వద్ద ప్రమాద స్థాయికి గోదావరి ప్రవహించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
కాటన్ బ్యారేజ్ నుంచి 2.02 లక్షల
క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల


