ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జిల్లా, రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు పెన్డౌన్ చేపట్టారు. జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కోలా రామచంద్రరావు, బేరి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 396 జీవో అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డారని అన్నారు. ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీ వరకు పెన్డౌన్ చేపడతామన్నారు. ప్రభుత్వం జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే ప్రాణ త్యాగానికై నా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫణి, కొయ్యా దుర్గారెడ్డి, ముదపాక నాగేశ్వరరావు, బేరి గోపాలకృష్ణ, తోట ప్రకాష్, బండారు శివ, మిరియాల మల్లేష్, రామచంద్రరావు, గొర్రెల చంద్రశేఖర్, కిలపర్తి రవి, రొంగల సాంబశివ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్: పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ నిరసన తెలిపారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పోతల శ్రీనివాసరావు, సమ్మెట చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఫణి, దానబోయివాసు, కందుకూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
దస్తావేజు లేఖర్ల ఆందోళన ఉధృతం


