రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో మంగళవారం చంద్రగ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేతుగ్రస్త చంద్రగ్రహణ హోమం నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) ఆదేశాల మేరకు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన హోమం సాయంత్రం 6.46 వరకూ కొనసాగింది. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ మాట్లాడుతూ పీఠంలో భక్తుల సంక్షేమాన్ని ఆశించి ఈ హోమాన్ని నిర్వహించామన్నారు. గ్రహణానంతరం పీఠంలోని అమ్మవారితో పాటు పరివార దేవతలకు సంప్రోక్షణ అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు అమ్మవారి పునఃదర్శనాన్ని, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబీ పాల్గొన్నారు.
త్రుటితో తప్పిన పెను ప్రమాదం
సఖినేటిపల్లి: టేకిశెట్టిపాలెం సమీపంలో పి.గన్నవరం ప్రధాన పంట కాలువపై ఉన్న బళ్ల వంతెన వద్ద కొబ్బరి దుంగలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నుంచి దుంగలు జారి పడ్డాయి. ఆ దారిలో వెళుతున్న ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొబ్బరి దుంగలు అధిక లోడుతో ఓ ట్రాక్టర్ మంగళవారం సఖినేటిలిపల్లి వైపు నుంచి పైవంతెన మీదుగా అప్పనరామునిలంక వైపు వెళుతోంది. ఆ క్రమంలో దుంగలకు కట్టిన తాళ్ల ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో దుంగలు చెల్లాచెదురై ఆకస్మాత్తుగా రోడ్డు మీద పడ్డాయి. అక్కడి నుంచి దొర్లుకుంటూ ప్రధాన రహదారిపైకి చేరాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


