రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చాగల్లు: నిడదవోలు – ఐ.పంగిడి రహదారిలో ఎస్.ముప్పవరం వద్ద ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చాగల్లు ఏఎస్సై ఎస్కే హుస్సేన్ కథనం ప్రకారం.. చాగల్లు గ్రామానికి చెందిన రాయుడు చరణ్బాబు (19) తన స్నేహితుడు పీతల హర్షతో కలసి ఆదివారం రాత్రి బైక్పై బ్రాహ్మణగూడేనికి కేటరింగ్ పనులకు వెళుతుండగా, నిడదవోలు వైపు నుంచి తాడిమళ్ల గ్రామానికి చెందిన చిక్కం నాని, కోరుమామిడికి చెందిన మాధవితో కలసి స్కూటీపై వెళుతూ ఎస్.ముప్పవరం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో చరణ్బాబు, నాని, మాధవికి తీవ్ర గాయాలు కావడంతో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అత్యవసర వైద్య సేవల నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా, మార్గం మధ్యలో చరణ్బాబు మృతి చెందాడు. నాని పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మాధవికి రాజమహేంద్రవరంలో వైద్య సేవలందిస్తున్నారని పోలీసులు తెలిపారు.
కుటుంబానికి ఆసరాగా ఉంటూ..
చరణ్బాబుకు తండ్రి లేకపోవడంతో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కేటరింగ్ పనులు చేస్తున్నాడు. అతని తల్లి వెంకటలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. పది రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. వెంకటలక్ష్మికి నలుగురు పిల్లలు కాగా, చరణ్బాబు చిన్న కుమారుడు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ కేటరింగ్ పనులకు వెళ్తున్నాడు. అతను మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
● ఇద్దరికి తీవ్రగాయాలు
● ఎస్.ముప్పవరంలో ఘటన


