
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే
● అమల్లోకి పాస్ విధానం
● రూ.3 వేలతో పొందే అవకాశం
● ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు
ఐ.పోలవరం: జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ (చార్జీ) చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు, ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోల్ కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్నిచోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ట్రిప్పుకు (టోల్గేటు) ఇరువైపులా కలిపి రూ.90 నుంచి 200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాస్ విధానం తీసువచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి, తిరిగి వెనక్కి వస్తే ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క.
దేశవ్యాప్తంగా 1,150 టోల్ గేట్లు
గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా, ఆ తరువాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకూ తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 1,150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద, 216 ఏ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్గేట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఎన్హెచ్ 216పై గొల్లప్రోలు వద్ద, ఎన్హెచ్ 16పై కృష్ణవరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు, నల్లజర్ల వద్ద టోల్గేట్లు కనిపిస్తాయి.
పాస్ పొందే విధానం
ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా, వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీప్లకు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. అయితే ఉత్తరాదిన కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలపై కూడా ఇది వర్తించదని తాజాగా ఎన్హెచ్ ప్రకటించింది.
డిజిటల్ రూపంలోనూ..
ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.మూడు వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ.3 వేలు చెల్లించిన తర్వాత, ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్కు లింక్ అవుతుంది. ఈ పాస్ ఒక ఏడాది కాలం, లేదా 200 ట్రిప్పులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దేని గడువు ముందు అయినా ఇక పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.
ఉపయోగాలు ఇవే
కేంద్ర రవాణా, ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్ గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడ, రావులపాలెం మీదుగా సొంత కారులో వెళ్లి వస్తే, ఇప్పుడున్న టోల్ చార్జీలను బట్టి నాలుగు టోల్ గేట్ల వద్ద దాదాపు రూ.565 వరకు చెల్లించాలి. కానీ వార్షిక ఫాస్టాగ్ కొన్నవారికి కేవలం రూ.120 మాత్రమే అవుతుంది. అదే అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు కాకినాడ, కత్తిపూడి మీదుగా వెళ్లేవారు రూ.500 వరకూ చార్జి కట్టాలి. ఇక నుంచి అది రూ.120కి తగ్గిపోతుంది. ఏడాది ఫాస్టాగ్ వల్ల సొంత కార్లు, వ్యాన్లు, జీపులు ఉన్న వారికి టోల్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుంది.

ఖర్చును కంట్రోల్ చేద్దాం