
94.68 శాతం పింఛన్ల పంపిణీ
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా గురువారం 94.68 శాతం మందికిఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. హుకుంపేట పంచాయతీ కాపుల పేటలో బెడ్ రిడెన్ అయిన చామకూరి నారాయణస్వామికి వృద్ధాప్య, బెజవాడ సత్యనారాయణకు దివ్యాంగ, మానేపల్లి జయకు వితంతు పింఛన్లను వారి ఇళ్ల వద్దనే ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 2,34,576 మందికి రూ.102.08 కోట్ల మేర పింఛన్లు అందించాల్సి ఉండగా మధ్యాహ్నానికి 2,22,095 మందికి రూ.96.43 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కేఎన్ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, పరమేశ్వరుడు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరి వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

94.68 శాతం పింఛన్ల పంపిణీ