
క్రమబద్ధీకరించాలని సీహెచ్ఓల ఆందోళన
రాజమహేంద్రవరం రూరల్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ)/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద సీహెచ్ఓలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద సీహెచ్ఓలుగా పని చేస్తున్న తాము రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంటు ఇవ్వాలని, ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.