
20న సార్వత్రిక సమ్మె
రాజమహేంద్రవరం రూరల్: దేశవ్యాప్తంగా మే 20న చేపడుతున్న సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సౌత్సెంట్రల్ జోన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమండ్రి మోడల్కాలనీలో ఎల్ఐసీ ఉద్యోగుల భవన్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విస్తృత కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషోర్కుమార్ మాట్లాడుతూ మే20న జరిగే సార్వత్రిక సమ్మెలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు దేశ వ్యాప్తంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలపై తమ నిరసన తెలుపుతామన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ముందుగా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులర్పించారు. ఇన్సూరెన్న్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాదం అంతం చేయడానికి తీసుకొన్న అన్ని నిర్ణయాలను సమర్థిస్తున్నామన్నారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు మాథ్యూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఎస్.గనెయ్య, ఓబీసీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఎ.కె.విశ్వనాథ్, రమేష్ బాబు, మహిళా కన్వీనర్ అర్.శిరీష , మచిలీపట్నం యూనియన్ సంయుక్త కార్యదర్శి కళాధర్, పీఎస్ఎన్ రాజులు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం సమ్మె విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని 20 బ్రాంచ్ ఆఫీసులలో పనిచేస్తున్న 100 మంది నాయకులు సభ్యులు పాల్గొన్నారు.