
విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి
యానాం: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తదుపరి ఉన్నతవిద్యను అభ్యసించడానికి సిద్ధపడుతున్న తరుణంలో విధి వక్రించింది. విద్యుత్ ప్రమాదంతో ఆ విద్యార్థిని కానరానిలోకాలకు తీసుకువెళ్లిపోయి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే యానాం పట్టణ పరిధిలో బెజవాడ గార్డెన్స్కు చెందిన లంక సిద్దార్ధమౌర్య (18) సోమవారం ఇంట్లో ట్యూబ్లైట్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఈ నేపథ్యంలో అపస్మారక స్థితిలోఉన్న అతనిని స్థానిక జీజీహెచ్కు తరలించారు. అయితే చికిత్స అందించినప్పటికీ సిద్దార్ధ మృతి చెందడం విషాదాన్ని నింపింది. మృతుని తండ్రి లంక చినలోవరాజు ఇటీవలి సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ కాగా, తల్లి లక్ష్మీ యానాం జీజీహెచ్లో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడు సిద్దార్ధమౌర్య కాకినాడ ఆదిత్య కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకుని కళాశాలలో ద్వితీయ స్థానాన్ని సాధించాడని తెలిపారు. చదువులో ఎంతో చురుకుగా ఉండే సిద్ధార్ధ మౌర్య అకాల మృతి అందరినీ కలచి వేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.