
క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రబోధించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి నగరంలోని గోదావరి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆశయం దేవాలయం వరకూ కాలి నడకన భారీ సిలువ యాత్ర నిర్వహించారు. పాపాల నుంచి భక్తులను విముక్తుల్ని చేయడానికి, వారి కష్టాలు తొలగించడానికి జీసస్ ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, శిలువ మరణం, ఆయన పట్ల నాటి రాజుల క్రూరత్వాన్ని కళ్లకు కట్టేలా ఈ యాత్ర సాగింది. సిలువ మోస్తున్న క్రీస్తు వేషధారణ, రాజభటులు ముళ్ల కొరడాలతో ఆయనను హింసించడం వంటి సన్నివేశాలను ప్రదర్శించారు. క్రీస్తు ప్రభువు స్ఫూర్తితో త్యాగం, సహనం, ప్రేమ, కరుణ, క్షమ వంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సందేశం ఇప్పించారు. తోటివారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందని, సమస్త మానవాళిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం తదితర అవగుణాలను రూపుమాపి, ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపించేందుకే క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోదావరి విచారణ, దివ్యదర్శిని దేవాలయం, ఆశయ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సిలువ మోస్తున్న ఏసుక్రీస్తు వేషధారి

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం