రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు అత్యవసరంగా తీసుకు రావాల్సిన అవసరముందని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోటిపల్లి లోవరాజు, నీలం మధుసూదనరావుల ఆధ్వర్యాన పలువురు న్యాయవాదులు సోమవారం కోర్టు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిహార్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని తక్షణం రూపొందించి, అమలు చేయాలని కోరారు. అనంతరం మోటారు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఏజీపీ పిల్లి మురళీ మోహన్ వెంకట రమణ, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న బ్యాగ్
దంపతులకు అప్పగింత
అమలాపురం టౌన్: విలువైన సొత్తుతో ఓ దంపతులు పొరపాటున పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు వెతికి పట్టుకుని అప్పగించిన ఘటన ఇది. వివరాలివీ.. ఉప్పలగుప్తం మండలం భట్టుపాలేనికి చెందిన భార్యాభర్తలు మానే సత్యనారాయణ, ఆదిలక్ష్మిలు ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు నుంచి అమలాపురం ఆర్టీసీ బస్ స్టేషన్కు డ్రైవర్ గుత్తుల శ్రీనివాసరావుకు చెందిన ఆటోలో వెళ్లారు. వారు దిగిన తరువాత ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఆ ఆటోలో బ్యాగ్ మరచిపోయినట్లు ఆ దంపతులు గుర్తించారు. దీనిపై తక్షణమే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఆటోను గుర్తించారు. ఆటోలో బ్యాగ్ ఉందేమో చూడాలని ఆటో డ్రైవర్ శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో, అతడు తన ఆటోలో ఆ బ్యాగ్ను గుర్తించి, పోలీసులకు సోమవారం సాయంత్రం అందజేశాడు. 10 గ్రాముల బంగారం, రూ.5 వేల నగదుతో ఉన్న ఆ బ్యాగ్ను పోలీసుల సమక్షంలో సత్యనారాయణ దంపతులకు ఆటో డ్రైవర్ అందజేశాడు. అతడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.


