కాకినాడ రూరల్: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు ఓసుపల్లి అనిల్కుమార్ (26) మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. మండలంలోని సూర్యారావుపేట గ్రామానికి చెందిన అనిల్కుమార్ మరో ఐదుగురితో ఈ నెల 2న చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకలపూడి ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు సూర్యారావుపేట – ఉప్పాడ మధ్య స్పెక్ట్రామ్ ఎదురుగా అనిల్కుమార్ మృతదేహం తేలియాడుతూ కనపడింది. ఈ మేరకు అతడి సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాక సర్పవరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


