పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి | Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి

Published Fri, Dec 9 2022 8:12 AM

Young Girl attack on Young Boy at KPHB, Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్‌ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది.

ఇక ఈమధ్యనే తాను ప్రేమిస్తున్నాను, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్‌ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. కాగా ఈ నెల 5వ తేదీన టీస్టాల్‌ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో అశోక్‌ పెళ్లి ప్రస్తావన తేగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బేడు (మినీ కట్టర్‌)తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్‌ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది.

పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదునైన బ్లేడ్‌ (మినీ కట్టర్‌)తో బలంగా దాడి చేయడంతో అశోక్‌ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్‌ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

చదవండి: (కోరిక తీర్చకుంటే మార్ఫింగ్‌ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు)

Advertisement

తప్పక చదవండి

Advertisement