ఆత్మహత్య కాదు.. హత్యే 

Woman Helps Lover For Killing His Husband In Prakasam - Sakshi

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

విచారణలో వెలుగులోకి వచ్చిన ఘటన..

కటకటాల వెనక్కి నిందితురాలు

సాక్షి, దర్శి టౌన్‌ (ప్రకాశం జిల్లా): ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందో మహిళ. విచారణలో అసలు విషయం వెల్లడవడంతో నిందితురాలు నేరం అంగీకరించింది. దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రం సంతమాగులూరుకు చెందిన దంపతులు చెన్నుపల్లి శ్రీనివాసరావు (45), సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సైదాలక్ష్మి కూలి పనులకు వెళ్తోంది. 18 నెలల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నల్లగంగుల వెంకటరెడ్డితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తాత అక్రమ సంబంధంగా మారింది. విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఆమెను భర్త మందలించాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి భర్తను అంతమెందించాలని పథకం వేసింది.

ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇంట్లో నిద్రించాడు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమె భర్త కాళ్లు పట్టుకొని కదలకుండా చేయగా ప్రియుడు పీక నొక్కి శ్రీనివాసరావును హతమార్చారు. తర్వాత ఆమె భర్తే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మృతుడి తమ్ముడు చెన్నుపల్లి వీరయ్య ఫిర్యాదు మేరకు సంతమాగులూరు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా నిర్థారించారు. వీఆర్వో వద్ద నిందితురాలు సైదాలక్ష్మి నేరం అంగీకరించింది. దీంతో మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కేసు పరిష్కారంలో ప్రతిభ కనబర్చిన దర్యాప్తు అధికారి, అద్దంకి సీఐ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్‌ఐ టి.శివన్నారాయణ, హెచ్‌సీలు సురేష్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డిలను ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ అభినందించినట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. (చదవండి: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సీఏ విద్యార్థి బలి) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top