మహిళకు పుటుగా మద్యం తాగించి..గొడవ పడి.. ఆపై

Woman Assasinate Tragedy In Mahabubnagar - Sakshi

సాక్షి, నారాయణపేట (మహబూబ్‌నగర్‌): మద్యం తాపి, గొడవ పడి ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట పట్టణంలోని బీసీకాలనీకి చెందిన కర్రెమ్మ (45) స్థానికంగా కాగితాలు, పాత ఇనుపసామగ్రి సేకరించి విక్రయించి జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఈనెల 5వ తేదీ ఉదయం కర్రెమ్మను అదే కాలనీకి చెందిన నరేశ్, నారాయణ బైక్‌పై ఎక్కించుకుని ఊట్కూర్‌ మండలంలోని తిప్రాస్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడి దుకాణంలో కల్లు తాపి వారూ తాగి శివారులోకి చేరుకుని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అనంతరం పాడుపడిన ఇంట్లో కట్టెలు వేసి కాల్చాలని యత్నించారు. ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి మోడాల్‌ బ్రిడ్జి కింద వేసి తిరిగి గుట్టుచప్పుడు గాకుండా నారాయణపేటకు చేరుకున్నారు.  

తల్లి కనిపించలేదంటూ.. 
ఈ విషయం తెలియని పెద్ద కుమారుడు మారెప్ప శుక్రవారం రాత్రి తల్లి కోసం బంధువులతో కలిసి వెతకసాగారు. అంతలోనే కాలనీవాసులు ఈ విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సైదయ్య కేసు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసింది తామేనని అంగీకరించారు. చివరకు నారాయణపేట సీఐ శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఇదిలాఉండగా నిందితులను తమకు అప్పగించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్ద కొద్దిసేపు ఆందోళనకు దిగారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top