ప్రేమ వివాహం.. కొత్తగా పరిచయమైన మరో ప్రియుడి మోజులో | Sakshi
Sakshi News home page

మజ్జిగలో నిద్రమాత్రలు.. వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టి ప్రియుడితో కలిసి

Published Tue, Mar 22 2022 7:17 AM

Wife Planned Husbands Murder With Boyfriend in Hyderabad - Sakshi

నాగోలు: ప్రేమ వివాహం చేసుకున్న ఓ వివాహిత కొత్తగా పరిచయమైన ప్రియుడి మోజులో పడి భర్తనే అంతం చేయాలని పథకం వేసింది. ప్రియుడి ద్వారానే ఓ సుపారీ గ్యాంగ్‌కు రూ.5 లక్షలు ఇప్పించింది. ఆమె “కనిపించకుండా పోవడం’తో ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించగా.. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని  పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..  

కారుకు జీపీఎస్‌తో కదలికలపై ఆరా.. 
►నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం, చీకటి మామిడి పరిధిలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన పొలగోని భాస్కర్‌ గౌడ్, హరిత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం నగరానికి వలస వచ్చారు. ఇసుక వ్యాపారం చేసే భాస్కర్‌  మన్సూరాబాద్‌ మధురానగర్‌ కాలనీలో వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వెంకటేష్‌ సైతం ఎల్బీనగర్‌ ప్రాంతంలో లారీల ద్వారా ఇసుక వ్యాపారం చేసేవాడు. కొన్నాళ్లు వీరిద్దరూ కలిసి వ్యాపారం చేశారు. అలా హరితతో వెంకటేష్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.  

►వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని వ్యవహారశైలి ఇరుగుపొరుగు వారి ద్వారా కుటుంబీకులకు తెలియడంతో వారు భాస్కర్‌ దంపతులను ఇంటి నుంచి ఖాళీ చేయించారు. అనంతరం వీరు చింతల్‌కుంట ప్రాంతానికి మారినప్పటికీ వెంకటేష్, హరిత మధ్య సంబంధం కొనసాగింది. భాస్కర్‌ కదలికలను తెలుసుకునేందుకు వెంకటేష్‌ అతడి కారుకు జీపీఎస్‌ పరికరం బిగించాడు. దీని ఆధారంగా అతడు ఇంటి నుంచి బయటకి వెళ్లడం గుర్తించి తాను హరిత వద్దకు వెళ్లేవాడు. భాస్కర్‌ తన ఇంటి సమీపానికి వస్తుంటే జీపీఎస్‌ అలారం మోగించేది. ఇలా అతడి రాకను తెలుసుకుని వెళ్లిపోతుండేవాడు. 

అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం.. 
►వెంకటేష్‌ మోజులో పడిన హరిత తమ ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. అతడిని అంతం చేయించాలని ప్రియుడికి సూచించింది. దీంతో అతడు ఈ పనిని మన్సూరాబాద్‌కు చెందిన నవీన్‌కు అప్పగించాడు. 
►అతడి ద్వారా రంగంలోకి దిగిన నల్లగొండకు చెందిన రౌడీషీటర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. సుపారీగా రెండు విడతల్లో రూ.5 లక్షలు చెల్లించాడు. ఈ కుట్ర అమలు చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. 
►ఇందులో భాగంగా ఈ నెల 16న హరిత మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారిపోగా వాట్సాప్‌లో సందేశం పెట్టి ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో భాస్కర్‌ ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వెంకటేష్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
►సాంకేతిక ఆధారాలతో ఇరువురినీ తిరుపతిలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. విచారణ నేపథ్యంలో వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం, భాస్కర్‌ హత్యకు కుట్ర తదితరాలు వెలుగులోకి వచ్చాయి. భాస్కర్‌ను హత్య చేసేందుకు అదును కోసం ఎదురు చూస్తున్న వీరు అతడి కారుకు బిగించిన జీపీఎస్‌ పరికరం ద్వారా కదలికలు గుర్తిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్‌ను పట్టుకున్నారు. రాజేష్‌ కోసం గాలిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement