ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ షాకింగ్‌ నిర్ణయం

Software Engineer Commits Suicide In Nellore District - Sakshi

గుడ్లూరు(కందుకూరు)నెల్లూరు జిల్లా: ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్థాపంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల శ్రీనివాసులు కుమార్తె నక్కల శ్రావణి (24) చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సంజీవ్‌ అనే యువకుడితో వివాహమైంది. సంజీవ్‌ బీఫార్మసీ చేసి ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం శ్రావణి 7 నెలల గర్భిణి. దీంతో ఇంటి దగ్గరే ఉండి వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రావణి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఫోన్‌ చేసి చెన్నైలోని ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాల్సింగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం తాను గర్భిణిని, అని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రస్తుతం ఆఫీసుకు రాలేనని, మరికొంత కాలం వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని శ్రావణి విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించి కచ్చితంగా ఆఫీసుకు రావాలని సూచించారు.

దీనికి శ్రావణి ఒప్పుకోకపోవడంతో 15 రోజుల క్రితం శ్రావణిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఉద్యోగం పోయిందని బాధపడుతూ ఉంది. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. గ్రామంతో పాటు బంధువులు, ఇతర ప్రదేశాల్లో వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే మంగళవారం గ్రామంలోని చెరువులో యువతి మృతదేహం ఉన్నట్లు గురించి శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణి మనస్థాపంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుడ్లూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్‌ దాడి   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top