పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం | Physically Challenged Woman Eet Ablaze In Narayanapet | Sakshi
Sakshi News home page

నారాయణపేటలో ప్రియుడి ఘాతుకం.. లైంగిక దాడి? ఆపై నిప్పటించి దివ్యాంగ యువతి దారుణ హత్య

Feb 19 2022 8:59 PM | Updated on Feb 19 2022 9:02 PM

Physically Challenged Woman Eet Ablaze In Narayanapet - Sakshi

దివ్యాంగ యువతిపై దాష్టీకానికి తెగపడ్డాడు ఆమె ప్రియుడు.

సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది.

బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్‌ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు.  ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్‌ ఎస్సై జనార్ధన్‌ గౌడ్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement