పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య  | Newly Groom Passed Away Slitting Throats With Blade In Khammam District | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య 

Jun 7 2022 1:05 AM | Updated on Jun 7 2022 9:13 AM

Newly Groom Passed Away Slitting Throats With Blade In Khammam District - Sakshi

నరేశ్‌ 

వైరా రూరల్‌: కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నాడు.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఏమైందో కానీ బాత్‌రూంలో బ్లేడుతో గొంతు, చెయ్యి కోసుకుని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుణ్యపురానికి చెందిన కంభంపాటి ఇస్రాయిల్, నాగమ్మ దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇస్రాయిల్‌ 25 ఏళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి నాగమ్మ ఆశవర్కర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. చిన్నకుమారుడైన నరేశ్‌ (29) 2014లో బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం గ్రూప్‌ –1, ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సిద్ధమవుతూనే ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఈ నెల 4వ తేదీన నరేశ్‌ వివాహం జరిగింది.

5వ తేదీ ఆదివారం స్వగ్రామమైన పుణ్యపురంలో జరిగిన రిసెప్షన్‌లో మిత్రులు, బంధువులతో కలసి రాత్రి 11 గంటల వరకు నరేశ్‌ సరదాగా గడిపాడు. సోమవారం ఉదయం విజయవాడ గుణదలలోని మేరీమాత చర్చికి వెళ్లాలని నిర్ణయించుకుని అద్దె కారు కూడా మాట్లాడాడు. తెల్లవారు జామునే కుటుంబీకులను నిద్ర లేపిన నరేశ్‌ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్‌రూంలోకి వెళ్లాడు.

అయితే ఎంత సేపటికీ నరేశ్‌ రాకపోకడంతో తలుపు కొట్టినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు కుర్చీ వేసుకుని పైనుంచి చూడగా నరేశ్‌ బ్లేడ్‌తో గొంతు, ఎడమ చేయి మణికట్టు వద్ద కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. తలుపులు పగులగొట్టి చూడగా అతను అప్పటికే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిం చారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్‌ తెలిపారు.
చదవండి: Hyderabad: బాలికపై ఐదుగురి లైంగిక దాడి.. వీడియోలు తీసి, బెదిరించి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement