నా తమ్ముడిని కొట్టి చంపేశారయ్యా !

My Brother Was Beaten To Death Deceased Brother - Sakshi

ఎస్పీ ఎదుట మృతుడి సోదరుడి ఆవేదన

పోలీసులే కేసు నీరుగారుస్తున్నారంటూ ఫిర్యాదు 

రొంపిచెర్ల : ‘నా తమ్ముడిని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ బోనంవారిపల్లెకు చెందిన చక్రధర్‌ జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని బోనంవారిపల్లెకు చెందిన సుధాకర్‌ రెండో కుమారుడు గౌతంరాజు(22), అదే గ్రామానికి యువతి ప్రేమించుకున్నారు. ఈ నెల 6వ తేదీ గౌతం రాజు అమ్మాయి తల్లిదండ్రులను కలిసి వివాహం చేయమని కోరారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు గౌతమ్‌ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఉరి వేసుకుని చావాలంటూ బెదిరించారు. 

దీంతో మనస్తాపం చెందిన గౌతమ్‌ అదే రోజు రాత్రి 8 గంటలకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. దీనిపై ఈ నెల 8వ తేదీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న గౌతమ్‌ 19వ తేదీ మృతి చెందాడు. దీనికి అమ్మాయి బంధువులు సురేంద్ర, రఘునాథ, వీరశేఖర్, తరుణ్, చరణ్, అరుణ, భాగ్యమ్మ, రెడ్డెమ్మ, శ్రేష్ట కారణమని చక్రధర్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణ హాణి ఉందని రక్షణ కల్పించాలని కోరారు. కొందరు టీడీపీ నాయకులు, పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ 9 మంది నిందితులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని ఎస్‌ఐ వెంకటేశ్వర్లను ఆదేశించినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top