నెల క్రితం భార్య హత్య.. చిక్కననుకున్నాడు.. కానీ..!

Man Assassinated Wife By injecting Cyanide At Hospital In Gujarat - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ఆంకలేశ్వర్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దాంపత్య జీవితంలో గొడవల కారణంగా సైనైడ్‌ ఇంజెక్ట్‌ చేసి భార్యను హత్య చేశాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులకు లభించిన ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘జిగ్నేష్‌ పటేల్‌ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ వాసవ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కాగా దాదాపు నెల క్రితం జూలై 8న అతడి భార్యకు ఛాతి నొప్పి వచ్చింది.

దీంతో గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు చికిత్స పొందుతున్నప్పుడు, నిందితుడు దొంగతనంగా సైనైడ్ టాబ్లెట్‌తో ఓ ద్రావణాన్ని తయారు చేశాడు. తర్వాత వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది లేనప్పుడు సిరంజిని ఉపయోగించి ఆమెకు జత చేసిన డ్రిప్ బాటిల్‌లోకి ఆ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేశాడు. అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే బాధితురాలు మరణించింది. ఆపై పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ప్రకారం వాసవ శరీరంలోకి సైనైడ్ ఇంజెక్ట్ చేయడంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆమె భర్త జిగ్నేశ్‌ పటేల్ ఆంక్లేశ్వరంలోని ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేశాడు.’’ అని పోలీసు అధికారి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top