మార్కులు తగ్గాయని ఇంట్లో నుంచి వెళ్లి.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్‌!

Kolkata Girl Fake Kidnap Drama Asks Rs 1 Cr From Parents After Scoring Less Marks - Sakshi

కోల్‌కతా: పరీక్షల్లో మార్కులు తగ్గితే కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తనని కిడ్నాప్‌ చేశారని నాటకమాడి తన తండ్రి నుంచి కోటి వసూలు చేయాలని ప్రయత్నించింది. ఈ షాకింగ్‌ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తన మార్కులను తెలుసుకునేందుకు సైబర్ కేఫ్‌కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.

అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్‌ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ నంబరు ఆధారంగా చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్‌ హోం ఎదుట వారు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. అయితే విచారణలో వారు కిడ్నాప్‌ కాలేదని ఇది డ్రామా అని తెలిసి అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక కూడా అంగీకరించింది.

చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్‌ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top