‘మామ్‌ సారీ.. ప్లీజ్‌ గివ్‌ లెటర్స్‌ టు మై ఫ్రెండ్స్’ | Gachibowli Inter Student Ends Life By Jumps From 23rd Floor | Sakshi
Sakshi News home page

‘మామ్‌ సారీ.. ప్లీజ్‌ గివ్‌ లెటర్స్‌ టు మై ఫ్రెండ్స్’

Mar 23 2021 8:58 AM | Updated on Mar 23 2021 1:24 PM

Gachibowli Inter Student Ends Life By Jumps From 23rd Floor - Sakshi

గచ్చిబౌలి: తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఓ ఇంటర్‌ విద్యార్థిని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోనె సురేష్‌ తెలిపిన ప్రకారం..నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్‌మెంట్‌ ఎఫ్‌ బ్లాక్‌లోని 23వ అంతస్తులో ఇషా రంజన్‌(17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది. జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు వదిలేసి స్టూల్‌ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాచ్‌మెన్‌ గమనించి చెప్పగా తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా భర్తలు మౌనిక సిన్హా, సికెష్‌ రంజన్‌లు 2015లో విడాకులు తీసుకున్నారు.

మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుండగా తండ్రి అమెరికా వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఇషా రంజన్‌ కొద్ది నెలల క్రితం స్లీపింగ్‌ ట్యాబ్లెట్లు వేసుకొని, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్‌ అవుతున్నానని స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది.  ఆత్మహత్యకు ముందు తల్లికి ‘మామ్‌ సారీ..ప్లీజ్‌ గివ్‌ లెటర్స్‌ టు మై ఫ్రెండ్స్‌’ అని సూసైడ్‌ నోట్‌ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇషా రంజన్‌ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: ‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement