విద్యుత్‌ షాక్‌కు నలుగురు యువకులు బలి | Four people died due to electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌కు నలుగురు యువకులు బలి

Nov 5 2024 5:34 AM | Updated on Nov 5 2024 5:34 AM

Four people died due to electric shock

మరో ముగ్గురికి గాయాలు 

తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా దుర్ఘటన

ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో  సర్దార్‌ పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్‌డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. 

ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్‌ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 

మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement