వైద్యుల నిర్లక్ష్యం వల్లే కుమారుడి చెయ్యి తొలగించారు..

FIR against Doctor For Negligence In West Godavari District - Sakshi

సాక్షి,పశ్చిమగోదావరి: వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన కుమారుడి చేతినే తొలగించాల్సి వచ్చిందని బాధిత యువకుడి తల్లి తాహేరా సుల్తానా కన్నీరుమున్నీరైంది. తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపింది. మంగళవారం ఆమె స్థానిక విలేకరులకు ఈ వివరాలు వెల్లడించింది. టి.నర్సాపురానికి చెందిన సయ్యద్‌ వినా యత్‌ (24) ఇంటీరియర్‌ డిజైనర్‌. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు ఆదాయం. ఇటీవల మానసికంగా ఒత్తిడికి గురవతుండటంతో కాకినాడలోని బెస్ట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ సైకియాట్రిస్ట్‌ వరప్రసాద్‌ జూలై 12న రెండు ఇంజక్షన్లు చేసి 10 రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు.

దానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుండటంతో అంత సొమ్ము పెట్టుకోలేక తిరిగి మరోసారి ఆసుపత్రికి వెళదామని వెనక్కి వచ్చేస్తూ రాజమండ్రిలోని బంధువుల ఇంటి వద్ద ఆగా రు. అదేరోజు రాత్రి వినాయత్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆ విషయాన్ని డాక్టర్‌ వరప్రసాద్‌కు ఫోన్‌లో వివరించారు. ఆయన సూచన మేరకు రాజమండ్రిలోని హరిత ఆసుపత్రిలో డాక్టర్‌ రాజేష్‌ను కలిశారు. ఆయన రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నర్సుతో పెరాల్గన్‌ ఇంజక్షన్‌ చేయించారు. ఇంజక్షన్‌ చేసే సమయంలో తన కుమారుడు నొప్పి, మంట అని ఏడ్చాడని తాహేరా సు ల్తానా చెప్పారు. ఆ విషయం నర్సుని అడగ్గా ఇంజక్షన్‌ కు అలాగే ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందన్నారు.

తెల్లవారేసరికి చెయ్యి నీలిరంగులోకి మారిపోయిందని, మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళ్లగా, సీటీ స్కాన్‌ చే యించారని, సాయి ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్‌ రాజేష్‌ సూచించారని వివరించారు. సాయి ఆసుపత్రికి వెళ్లి చూపించగా, చేయిని తొలగించాలని, లేకపోతే ప్రమా దమని, రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారని తెలిపింది. గత్యంతరం లేక అప్పు చేసి ఆ సొమ్ము చెల్లించానని, తొలుత చేతిని కొద్దిభాగం తొలగించి తరువాత మళ్లీ మోచేతి పైభాగం వరకు తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కాకినాడ వెళ్లి ఎస్పీని కలిసినట్టు చెప్పింది. పోలీసులు డాక్టర్‌ వరప్రసాద్, డాక్టర్‌ రాజేష్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు ఆమె వెల్లడించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చేతిని కోల్పోవాల్సి వచ్చిందని, తమ కు న్యాయం చేయాలని కోరింది. ఆ మేరకు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆమె పేర్కొంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top