పెన్‌ డ్రైవ్‌లో ప్రైవేట్‌ ఫోటోలు..రూ. 5లక్షలు ఇవ్వాలంటూ..

Couple Blackmailed Over Intimate Photos In Lost Pen Drive In Madhya Pradesh - Sakshi

తమ ప్రైవేట్‌ ఫోటోలను, వీడియోలను మొబైల్‌లో బంధించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం లవర్స్‌ అలా చేస్తుంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటననే నిదర్శనం. ఓ ప్రేమ జంట తమ జ్ఞాపకార్థం ప్రైవేట్‌ ఫోటోలు దిగి  పెన్‌ డ్రైవ్‌లో బంధించుకుంది. అది కాస్త మరో వ్యక్తి చేతిలో పడింది. దీంతో అతడు ఆ లవర్స్‌కు ఫోన్‌ చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అతని వేధింపులు తాళలేక ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కి చెందిన ఓ లా స్టూడెంట్(21),ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఇటీవల తమ సహచర లా స్టూడెంట్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో మథుర హైవే పక్కనున్న ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆగారు. ఆ సమయంలో తమ లగేజీని ఓ టేబుల్ పక్కన పెట్టారు. తిరుగు ప్రయాణంలో బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ అక్కడే పడిపోయింది. అది ఓ వ్యక్తికి దొరికింది. అందులో లవర్స్‌  ప్రైవేట్‌ ఫోటోలు ఉండటంతో వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయాలని భావించాడు.

ఫొటోల స్క్రీన్‌షాట్‌పై యువతి మొబైల్‌ నంబర్‌ ఉండగా ఈ నెల 15న తొలుత ఆమెకు ఫోన్‌ చేసి రూ.5 లక్షల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఆ యువతిని బెదిరించి ప్రియుడి మొబైల్‌ నంబర్‌ సేకరించాడు. అతడికి కూడా ఫోన్‌ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. రోజు రోజుకి అతని వేధింపులు ఎక్కువ అవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ జంట ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top