ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య

Chittoor Murder Case : Delhi Babu Committed Suicide - Sakshi

పెనుమూరు(చిత్తూరు జిల్లా): ప్రేయసిని కత్తితో దారుణంగా హత్య చేసిన 24 గంటల్లోపే ఓ ప్రేమోన్మాది చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. పాకాల సీఐ ఆశీర్వాదం కథనం మేరకు.. పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.షణ్ముగరెడ్డి కుమార్తె గాయత్రి(20) పూతలçపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన సుబ్బయ్య కుమారుడు ఢిల్లీబాబు(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత నెల ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు తిరుపతిలో ఉన్న ప్రేమికులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత గాయత్రి తల్లిదండ్రులతో వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీబాబు ఆ యువతితో మాట్లాడే ప్రయత్నం చేశాడు.

అందుకు ఆమె నిరాకరించడంతో గొంతు కోసి, కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు సమీప అటవీ ప్రాంతానికి పారిపోయాడు. అతని కోసం పోలీసులు  ఆరు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలించారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు  పూతలపట్టు మండలం చింత మాకులపల్లె సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన గాయత్రి మృతదేహానికి బుధవారం సాయంత్రం స్వగ్రామం తూర్పుపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు తూర్పుపల్లె, చింతమాకులపల్లెలో పోలీసుల గస్తీ కొనసాగుతోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top