జాబ్‌ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు | CBI Arrested Bhola Yadav Osd Of Former Railway Minister Lalu Prasad | Sakshi
Sakshi News home page

'భూమిస్తే ఉద్యోగం' కుంభకోణం.. లాలూ ప్రత్యేకాధికారి అరెస్టు

Jul 27 2022 3:28 PM | Updated on Jul 27 2022 3:28 PM

CBI Arrested Bhola Yadav Osd Of Former Railway Minister Lalu Prasad - Sakshi

ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది

 పట్నా: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్‌ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది.

ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్‌లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది.

అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్‌జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్‌ లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్‌ థాక్రే కీలక వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement