మద్యం మత్తు.. బంధాలు చిత్తు! | Assassination Incidents in Alluri and Annamayya districts | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. బంధాలు చిత్తు!

Nov 23 2024 5:02 AM | Updated on Nov 23 2024 5:02 AM

Assassination Incidents in Alluri and Annamayya districts

తండ్రి చేతిలో కుమారుడు.. కుమారుడి చేతిలో తండ్రి హత్య

‘అల్లూరి’, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలు 

సీలేరు/రాయచోటి టౌన్‌: రాష్ట్రంలో ఏరులై పారు­తున్న మద్యం.. బంధాలను బలి తీసుకుంటోంది. మద్యానికి బానిసైన కుమారుడిని... తండ్రి, మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కుమారుడు హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దార­కొండ పంచాయతీ ఏనుగుబయలుకు చెందిన చెందిన కొర్రా సన్యాసి(30) మద్యం తాగి తండ్రితో, కుటుంబ సభ్యులతో రోజూ గొడవ పడుతున్నాడు. 

గురువారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రి చిత్రోతో గొడవ పెట్టుకున్నాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యు­లను తీవ్రంగా కొట్టాడు. కుమారుడి నుంచి తప్పించుకునేందుకు తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని అటవీ ప్రాంతానికి పారిపోయాడు. ఆయనను వెంబడిస్తూ కుమారుడు కూడా అడవిలోకి వెళ్లాడు. 

ఎక్కడ తన కుమారుడు తనను చంపుతాడోనన్న భయంతో గొడ్డలితో కుమారుడిని నరికి చంపేసి.. గొయ్యి తీసి పాతిపెట్టాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసు­కున్న పోలీసులు అడవికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.  

తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని..  
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి  పట్టణ శివార్లలో నివాసముంటున్న వెంకట చలపతి(55) నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. వారికి జీవన్‌ బాబు అనే 19 ఏళ్ల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తాగొచ్చి తల్లిని వేధించడంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది. 

అప్పటికే కోపోద్రిక్తుడైన కుమారుడు అక్కడే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో వెంకటచలపతి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో నేలపై పడిపోవడంతో స్థానికులు రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. జీవన్‌ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement