కాంబోడియా సైబర్‌ కేసులో కీలక అరెస్టు | arrest in Cambodia cyber case: Telangana | Sakshi
Sakshi News home page

కాంబోడియా సైబర్‌ కేసులో కీలక అరెస్టు

Sep 14 2024 5:40 AM | Updated on Sep 14 2024 5:40 AM

arrest in Cambodia cyber case: Telangana

ఉద్యోగాల పేరిట ఎరవేసి.. ఉచ్చులోకి దింపుతున్న కిలేడీ

 సైబర్‌ నేరాలు చేసేలా బాధితులకు చిత్రహింసలు

నిందితురాలిని ముంబైలో అరెస్టు చేసిన సీఎస్‌బీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కాంబోడియాలో అత్యధిక వేతనాలతో కొలువులు ఆశగాచూపి.. అక్కడకు వచి్చన యువకులను సైబర్‌ నేర ముఠాలకు అప్పగిస్తున్న ఓ కీలక వ్యక్తిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతానికి చెందిన నిందితురాలు ప్రియాంక శివకుమార్‌ సిద్దును అరెస్టు చేసినట్టు టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయి ప్రసాద్‌ల నుంచి ముంబైకి చెందిన ప్రియాంక ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్‌ తీసుకుని కాంబోడియా పంపింది. 

అక్కడ చైనా సైబర్‌ ముఠాలు తమతో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించారని, మానసికంగా, శారీరకంగానూ హింసించినట్టు భారత్‌కు తిరిగి వచి్చన ఇద్దరు బాధితులు టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్‌బీ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంబోడియాకు అమాయకులను తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న 30 ఏళ్ల ప్రియాంకను అరెస్టు చేశారు.  

సైబర్‌ ముఠాల నుంచి కమీషన్‌.. 
ప్రియాంక తొలుత మాక్స్‌వెల్‌ అనే ఓవర్‌సీస్‌ జాబ్‌ ప్రాసెసింగ్‌ ఏజెన్సీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. తర్వాత ఆ ఏజెన్సీ మూతపడడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తానే స్వయంగా ఓ ఏజెన్సీని ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతీసింది. ముంబైలో ఇదే విధంగా ఏజెన్సీ నడుపుతున్న నారాయణ అనే వ్యక్తి ఇచి్చన సమాచారంతో ప్రియాంక కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా కంపెనీ ఝాన్‌జీ ఎండీ జితేందర్‌సింగ్‌ను కలిసింది. సైబర్‌ నేరాలు చేసేందుకు మనుషులను తనకు అప్పగిస్తే ఒక్కొక్కరికి 500 యూఎస్‌ డాలర్లు కమీషన్‌ ఇచ్చేలా వారితో ఒప్పందం చేసుకుంది. తొలుత ఇద్దరినికాంబోడియాకు పంపింది. అది విజయవంతం కావడంతో సోషల్‌ మీడియా, న్యూస్‌ పేపర్లలో కాంబోడియాలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున ప్రకటనలు ఇచి్చంది. 

అవి నమ్మిన అమాయకులను కాంబోడియా చైనా సైబర్‌ క్రైం ముఠాల వద్దకు ప్రియాంక పంపినట్టు టీజీసీఎస్‌బీ అధికారులు గుర్తించారు. ఇలా కాంబోడియాకు వెళ్లిన అమాయకులను అక్కడి చైనా సైబర్‌ క్రైం ముఠాలకు అప్పగిస్తున్నారు. సైబర్‌ నేరాలు చేసేలా బాధితులను సదరు ముఠాలు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాయి. ఈ ముఠా నుంచి అతికష్టం మీద తప్పించుకుని తిరిగి వచి్చన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో టీజీసీఎస్‌బీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీజీ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement